చంద్రబాబుకు రజినీకాంత్ ఫోన్.. ఏమన్నారంటే..!
Super star rajinikanth phone calls to nara chandrababu
By అంజి Published on 21 Nov 2021 10:15 AM IST
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అసెంబ్లీలో పలువురు నాయకులు ఓ ప్రతిపక్ష నేత సతీమణిని దూషించడంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా అసెంబ్లీలో చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై జరిగిన పలు పరిణామాలను మీడియా ద్వారా తెలుసుకున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం చంద్రబాబుకు రజినీకాంత్ ఫోన్ చేసి మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో బాధపడుతున్న చంద్రబాబను పరామర్శించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఇదే విషయంపై అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబును ఫోన్లో పరామర్శించారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు 1984 సంవత్సరం నుండి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని చాలా బాధపడ్డానని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలు చేయడంపై నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్తో పాటు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక మహిళను వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.