కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర జ్వరాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. 14 మంది విద్యార్థులకు తీవ్ర జ్వరం, జలుబుతో తీవ్ర అస్వస్థత చెందారు. కాగా విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురి కావడంతో.. విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో విద్యార్థులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థుల బ్లడ్ శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించామని అధికారులు చెప్పారు. అయితే విద్యార్థులకు తీవ్ర జ్వరం వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ నివాస్తో కలిసి ఆస్పత్రి వెళ్లారు. వైద్యులతో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా వైరల్ జ్వరాల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ నివాస్ తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు.. కరోనా, డెంగీ రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతకు గురికావడంపై మంత్రి ఆదిమూలపు సురేష్ నివేదిక కోరారు.