ముందు నన్ను గెలిపించండి.. సీఎం అభ్యర్థిపై త‌ర్వాత‌ చర్చ చేద్దాం : పవన్

నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

By Medi Samrat  Published on  1 Dec 2023 1:48 PM GMT
ముందు నన్ను గెలిపించండి.. సీఎం అభ్యర్థిపై త‌ర్వాత‌ చర్చ చేద్దాం : పవన్

నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయ‌న మాట్లాడుతూ.. మంచి పని చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకూడదన్నారు. నా సినిమాలు ఆపినా.. బెదిరించినా నేనెప్పుడూ జాతీయ స్థాయి నాయకులను అడగలేదని.. నా‌ పోరాటం నా గడ్డపై నేనే చేశానని.. నా ఇబ్బందులను నేనే ఎదుర్కొని నిలబడతాన‌ని స్ప‌ష్టం చేశారు.

నేడు టీడీపీ, జనసేన కలిసి వెళ్లడానికి కార్యకర్తలు కూడా ఒక‌ కారణం అని వివ‌రించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి పని చేశాయని.. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంద‌ని అన్నారు. చిన్న పొస్ట్ పెడితే, ఆలోచన చెప్పినా బెదిరిస్తారు. తమిళనాడు సూపర్ స్టార్ ను కూడా వీళ్లు తిట్టేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకూ స్థానం ఉండాలన్నారు.

ముఖ్యమంత్రి ఎవరు అని వివాదం చేయడానికి చూస్తున్నారు. నాకు ఓట్లు వేయని‌వారే ఇలాంటి అంశాలను తెర పైకి తెస్తారు. నేను గత ఎన్నికలలో పోటీ చేస్తే ఒక్క స్థానం ఇచ్చారు. ముందు నన్ను, నా పార్టీని గెలిపించండి. ఆ స్థానాలను బట్టి సీఎం అభ్యర్థిపై చర్చ చేద్దామ‌ని.. వసుదైక కుటుంబం అనే ఆలోచన లేకుండా ఎలా ముందుకు సాగుతాం అని ప్ర‌శ్నించారు. కులాలను కలుపుకుని ఐక్యంగా అడుగులు వేద్దామ‌ని పిలుపునిచ్చారు.

వైసీపీ ట్రాప్ లో కొంతమంది మపడిపోతున్నారు .వాళ్ల మాయలో పడి క్యాస్ట్ పాలిటిక్స్ చేయకండి. మానవత్వం ఉన్న వాడు అన్ని కులాలను సమానంగా చూస్తారని పేర్కొన్నారు. ఒక్క కులం అని ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు. వైసీపీ కులాల వారీగా ప్రజలను చీల్చడానికి కుట్ర చేస్తుందన్నారు. 2019లో నేను ఓడినా.. నా వాళ్లే నా వెంట నడిచారు. కొంతమంది వెళ్లిపోతామన్నా.. నేను ఆపను.. అది వాళ్ల ఇష్టం. సీట్ల కోసం వచ్చిన వాళ్లు మాత్రం సీట్లు మార్చుకున్నారు. పెద్ద స్థాయి నుంచి వచ్చామని నా మీద పెత్తనం చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తుంది. నాకు ప్రజలు, రాష్ట్రం ముఖ్యం.. నా‌ విధానాలు నచ్చితే నాతో నడవండి.. నచ్చకుంటే వెళ్లిపోండని నిర్మోహ‌మాటంగా చెప్పారు.

2009లో‌ పార్టీ ఓడినా.. నడపలేక పోవడం వల్ల తప్పు జరిగిందన్నారు. నేను నా ప్రాణం ఉన్నంత వరకూ జనసేనను ముందుకు తీసుకెళతాప‌పి స్ప‌ష్టం చేశారు. ఎన్ని అడ్డంలకులు ఎదురైనా పార్టీ నడపాలని తొలిరోజే నిర్ణయం తీసుకున్నాను. నేడు ఆరు లక్షల మంది జనసేన సైనికుల‌తో కలిసి నడుస్తున్నాన‌న్నారు. నాయకుడు అనే వాడు అన్నీ తట్టుకుని నిలబడాల‌న్నారు. మన బలం ఎంత, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆలోచించాలి. జగన్ అనే వాడు మహానుభావుల తరహాలో పాలన చేస్తే ఒంటరిగానే పోటీ చేసే వాళ్లమ‌న్నారు.

జగన్ చాలా దిగజారి చాలా నీచంగా మాట్లాడాడు. అయినా నాకు సంస్కారం ఉంది.. వాళ్ల లాగా నేను మాట్లాడను. నా పార్టీ నుంచి వెళ్లిన వారితో నన్ను తిట్టిస్తున్నారు. వైసీపీ నాయకులు బూతులు తిడుతున్నారు. రాష్ట్రం కోసం ఎన్ని మాటలు పడటానికైనా సిద్ధంగా ఉన్నానని.. వచ్చేది టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వమేన‌న్నారు. అప్పుడు తిట్టిన వాళ్లంతా బాగా గుర్తు పెట్టుకోండి. టీడీపీ వెనుక జనసేన నడవటం లేదు.. టీడీపీ పక్కన జనసేన నడుస్తుందన్నారు.

అన్ని మతాలు, కులాలను కలుపుకుని అడుగులు వేద్దామ‌ని పిలుపునిచ్చారు. సంక్షేమ పధకాలు ప్రజలకు అవసరం.. నా సొంత డబ్బు ఇస్తున్న నేను.. ప్రభుత్వ ధనాన్ని సక్రమంగా పంచలేనా అని ప్ర‌శ్నించారు. నాలుగు గ్యాస్ సిలిండర్ లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామ‌న్నారు. వైసీపీ నాయకుడు సక్రమంగా పాలన చేస్తే గౌరవించే వాళ్లమ‌న్నారు. అతని అరాచక పాలన వల్లే నేడు ఈ నిర్ణయాలు తీసుకున్నాం. కేవలం వంద రోజులే సమయం ఉంది. ఎన్నికలలో సమర్థవంతంగా పాల్గొనే సత్తా మనకి ఉందా.. ఓట్లు వేసే ప్రజలను పోలింగ్ బూత్ ల వరకు తీసుకెళ్లాలన్నారు. గతంలో ఇటువంటి అంశాల్లో మనం విఫలమయ్యాం. నాయకులతో తిరిగిన వారికి కనీసం భోజనం పెట్టలేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కడుపు మాడ్చమని కాదు. ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖర్చు చేయండి. మనం పొటీ ఎక్కడ చేయవచ్చు.. ఎలా‌ గెలవచ్చో ఆలోచన చేయండి. అధికారాన్ని కలిసి పంచుకునేలా జనసేన విజయం కోసం పని చేయండని దిశానిర్దేశం చేశారు.

ఊహల్లో విహరించ వద్దు... వాస్తవంలోకి వచ్చి ఆలోచన చేయండన్నారు. జనసేన బలం, బలహీనతలు తెలుసుకునే నేను మాట్లాడతాన‌న్నారు. ఏపీలో సుస్థిరత, సమైక్యత, సంపద అంశాలతోనే ముందుకు సాగుదాం.. వీటి కోసమే నేను టీడీపీతో పొత్తు పెట్టుకున్నాన‌ని స్పష్టం చేశారు. రాజధాని లేని రాష్ట్రం గా ఏపీని నాశనం చేశారు. చుక్కాని లేని‌నావగా మార్చారర‌న్నారు. అమరావతే ఏకైక రాజధాని అనేది జనసేన సిద్దాంతమ‌న్నారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి, రాయలసీమను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామ‌న్నారు. లోతుగా అధ్యయనం చేసే నేను మాట్లాడుతున్నా.. పదేళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డాం. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత చాలా మంది నా దరిదాపుల్లోకి రాలేదు. నా యువత, ఆడపడుచులు, కార్యకర్తలు మాత్రం అండగా ఉన్నారని పేర్కొన్నారు. వారి భవిష్యత్తు కోసమే ఈ పొత్తు నిర్ణయం తీసుకున్నాన‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామ‌న్నారు. జనసేన అధికార ప్రతినిధులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని చర్చలకు వెళ్లండి. వాళ్లు నోరు పారేసుకున్నారని, మనం దిగజారి మాట్లాడవద్దు. పదేళ్ల‌పాటు జనసేనను నేను నడిపిన తీరును బీజేపీ నాయకులు అర్ధం చేసుకున్నారు. కానీ నాతో కలిసి నడిచిన కొంతమంది మాత్రం అర్ధం చేసుకోలేక పోయారన్నారు. మిడిమిడి జ్ఞానం తో ఏదేదో మాట్లాడతారు. అలాంటి‌వారు జనసేన ను‌ వీడి.. ఇతర పార్టీ లోకి‌ వెళ్లిపోవచ్చన్నారు. మోదీ, నడ్డా, చంద్రబాబు వంటి వారికి నా భావజాలం అర్ధమైంద‌న్నారు.

ఎన్ని గాయాలు జరిగినా.. నేను తట్టుకుంటానన్నారు. నా సీటుతో పోటీ చేసి‌.‌. నన్ను తిడితే ఎలా.. మీకు ఇష్టం లేకుంటే మీ నిర్ణయం మీదన్నారు. సంతోషంగా వారు వెళ్లిపోవచ్చు.. ఇక నుంచి టీడీపీ, ‌జనసేన పొత్తు గురించి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దన్నారు. అలా మాట్లాడితే కోవర్టులుగా మేము భావిస్తామ‌న్నారు. కురుక్షేత్ర యుద్ధం అంటున్న జగన్ అర్జునుడు, కర్ణుడు కాదన్నారు. లక్ష కోట్లు దొబ్బేసి.. జైలుకు వెళ్లి వచ్చిన దొంగ అన్నారు. దోపిడీ దారులను తరిమి కొట్టే పోరాటంలో మనకి ప్రజలు అండగా‌ ఉంటారన్నారు. ఈ వంద రోజులూ అందరూ ప్రజల్లోకి వెళ్లండి.. వాస్తవాలు వివరించండ‌ని సూచించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పని చేయండి.. మన పొత్తులు ఎలా ఉన్నా డెబ్బై శాతం అందరూ అంగీకరించారు. అభ్యంతరం ఉన్న ఇతర అంశాలు అంతర్గతంగా చర్చించుకుందామ‌న్నారు.

Next Story