గుడివాడలో పవన్ కళ్యాణ్ కౌంటర్లు వేసింది వారికేనా.?
Pawan Comments In Gudivada. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం గుడివాడలో పర్యటించారు.
By Medi Samrat
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం గుడివాడలో పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలలో నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించారు. గుడివాడ తర్వాత కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గాన కంకిపాడు, మానికొండ మీదుగా గుడివాడ చేరుకున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు.
గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మాట్లాడుతూ సినిమాలు చేయడాన్ని చాలామంది విమర్శిస్తున్నారని.. పేకాట క్లబ్బులు నడుపుకుంటూ , సిమెంటు ఫ్యాక్టరీలు నడుపుకుంటూ రాజకీయాలు చేసే వాళ్లున్నప్పుడు తాను సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిథులు బాధ్యతగా ఉండకపోతే ప్రజలు రోడ్లపై పడేస్తారని.. భయపెట్టి పాలిస్తామంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కంకిపాడు నుంచి గుడివాడ వచ్చేవరకు రోడ్డు దారుణంగా ఉందని.. నాయకులు ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ నిలదీశారు. 'నన్ను విమర్శించే వాళ్లందరూ పాపం ఖద్దరు కట్టుకుని కేవలం రాజకీయాలే చేస్తుంటారు. కొల్లాయి ధరించి రాజకీయం తప్ప ఇంకేం చేయరండి. వాళ్ల దగ్గర డబ్బులు కూడా లేవండీ పాపం. అనుక్షణం 'మా ప్రజలు మా ప్రజలు' అనుకుంటూ రోడ్లపై తిరుగుతుంటారు' అని విమర్శకులను ఉద్దేశించి కౌంటర్లు వేశారు పవన్.