నెల్లూరు జిల్లా వరద బాధితులపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి మందు తాగి.. మీ ఇష్టం వచ్చినట్లు రచ్చ చేస్తారా అంటూ వరద బాధితులపై ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని ఇక్కడికి వస్తే డౌన్ డౌన్ అంటూ ఆయని నిలదీశారని మండిపడ్డారు. బుద్ధి ఉందా, సిగ్గు ఉందా మీకు అని అంటూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ఫైర్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాన్ని ఇంచార్జి మంత్రికి చూపిద్దామని తీసుకొచ్చానని అన్నారు. మీరు అరిస్తే ఏమొస్తది, ఏం చేయగలుగుతారు అంటూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. వరద బాధితులకు అండగా ఉంటామన్నారు. అలాగే నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. మంగళవారం నాడు కోవూరులో పర్యటించేందుకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి, కలెక్టర్ చక్రధర్బాబులు వెళ్లారు. వరద నష్టాన్ని అంచనా వేయాలనుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ప్రజలు.. అంతా అయిపోయాక ఇప్పుడెందుకు వచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులను నిలదీశారు.