పవన్ కళ్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసిన మంత్రి రోజా
Minister Roja Fire On Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు.
By Medi Samrat
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు జాతకం చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. మాకు 45 సీట్లు వస్తే మిగిలిన 130 సీట్లు నీకే వస్తాయా? అని ప్రశ్నించారు. ముందు సర్పంచ్ లుగా గెలవండి, ఆ తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించవచ్చన్నారు. జనసేన తరఫున పోటీచేసేందుకు 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా..? అసలు, 175 స్థానాల్లో జనసేనను బరిలో దింపేంత దమ్ము పవన్ కళ్యాణ్ కు ఉందా? జగన్ సీఎం కాడు ఇదే నా శాసనం అని అన్నావు.. శాసనం అన్నవాడ్ని శాసనసభలోకి కూడా రానివ్వలేదు.. ఈ విషయం మర్చిపోయావా? అని రోజా ప్రశ్నించారు.
పవన్ సభలకు వచ్చేది గ్రామాల్లో సినిమా పిచ్చి ఉన్నవాళ్లేనని, వాళ్లను చూసి పవన్ రెచ్చిపోతున్నాడని విమర్శించారు. నువ్వు తెలుగు హీరో అని చెప్పుకోవడానికి చిత్రపరిశ్రమలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారని.. గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేశారని వెల్లడించారు. చిరంజీవి కూడా సింగిల్ గానే పోటీ చేశారని, అదే రక్తం పంచుకుపుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టావే కానీ, ఎన్నికలకు వెళ్లావా? అని అన్నారు.
ఆదివారం నిర్వహించిన జనసేన లీగల్ సెల్ సమావేశంలో పవన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 67 సీట్లే వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వ్యాఖ్యలపై రోజా ఈ విధంగా ఫైర్ అయ్యారు.