పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం టోల్ ప్లాజా దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంతలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఎదురుగా వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బస్సును ఆపి బస్సులోని లగేజీ డెక్లు, సీట్ల కింద తనిఖీలు నిర్వహించగా అక్కడ నోట్ల కట్టలు కనిపించాయి. కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్, క్లీనర్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. పట్టుబడిన మొత్తం రూ.4.76 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అయితే ఇటీవల హైవేలు అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. కొందరు స్మగ్లర్లు నగదు, బంగారం, వెండి, మద్యం తరలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన కారును తనిఖీ చేస్తుండగా సీటు కింద కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. డ్రైవర్ సీటు కింద ఉన్న టూల్ బాక్స్ లో ఏకంగా రూ. 65 లక్షల నగదు బయట పడింది. ఇంతకుముందు కూడా పలుమార్లు పెద్ద మొత్తంలో నగదు, మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.