ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు.

By అంజి  Published on  1 Sep 2024 9:06 AM GMT
Heavy rains, floods, AndhraPradesh, CM Chandrababu

ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

అమరావతి: భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్ లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్ కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా అని తెలిపారు. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాలకు పంపాలని ఆదేశించారు.

''నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గింది. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయి. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు....కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలి. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలి. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడింది. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయి. నేషనల్ హైవే అథారిటీతో సమన్వయం చేస్తూ పనిచేయాలి. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించండి...దానికి అనుగుణంగా రెస్క్యూ ప్లాన్ చేయండి. • వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుంది...ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలి. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి'' అని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్న సీఎం సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి.. సీఎంకు వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంకు వివరించారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరించారు.

''కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలి. మనం చేసే పనితో ప్రజల్లో సంతృప్తి కలగాలి. మనం మంచి చేసి సాయం అందిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలి. ఒక్క ఎకరా కూడా మిస్ అవ్వొద్దు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదు. దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలి. పనితీరు, వ్యవస్థలో లోపాలు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదు..మనమంతా ప్రజల కోసమే పని చేస్తున్నాం...వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు. ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుంది...ఆ దిశగానే మనం పని చేయాలని అందరూ గుర్తు పెట్టుకోవాలి. బాధ్యతలు అప్పగించిన అధికారులు విధులు సరిగా నిర్వర్తించకుండా తప్పించుకుంటే చర్యలు తప్పవు...ప్రతి ఒక్కరికీ జవాబుదారీ తనం ఉండాలి. మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలి. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మనం వారికి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి'' అని సీఎం అధికారులకు సూచించారు.

Next Story