ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేపటికి సంవత్సరం పూర్తి కానుంది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు మరిచారని వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు సంక్షేమం దూరమైందని జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసం సృష్టించిందని, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను రద్దు చేశారని తెలిపారు. కానీ .. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే రేపు వైసీపీ నిర్వహించ తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవానికి మద్దతుగా రాష్ట్ర ప్రజలు తరలిరావాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు.