ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. దీంతో జోరు వానలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు.
పర్యటనలో ఆయన మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్దవటంతోపాటు ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియచేయాలని అధికారులకి సూచించారు.
శంబర గ్రామంలో పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించిన ఆయన రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్ లో వీడియో తీసుకున్నారు.