ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్న సీఎం నెల్లూరు చేరుకోనున్నారు. నెల్లూరు అర్బన్ లోని మైపాడు గేట్ వద్ద చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 30 కంటైనర్లతో సిద్ధం చేసిన 120 షాప్ లను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం వెంకటాచలం మండలం, ఎడగాలి గ్రామానికి చేరుకుని అక్కడ నిర్మించిన నంద గోకులం లైఫ్ స్కూల్ను సీఎం ప్రారంభిస్తారు. అక్కడి విద్యార్దులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అక్కడికి సమీపంలోనే గోశాలకు హాజరై నంది పవర్ ట్రెడ్ మిల్ మిషిన్, నంద గోకులం సేవ్ ద బుల్ ప్రాజెక్టులు, ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు సీఎం విజయవాడ చేరుకోనున్నారు.