రాత్రికి సింగపూర్ బయలుదేరనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.
By Medi Samrat
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు చంద్రబాబు బృందం సింగపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పెట్టుబడుల సాధన కోసం రేపటి నుంచి 5 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు చంద్రబాబు. పర్యటనలో భాగంగా సీఎం ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.
మొదటి రోజు సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ తో పాటు మలేషియా, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ , థాయ్ లాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు, ఉద్యోగులు హాజరు కానున్నారు. AP NRT ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరుకానున్న దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేసిన AP NRT, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చర్చించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఏపీ అభివృద్దిలో భాగస్వాములు చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది.
జీరో పావర్టీ -P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం కోరనున్నారు. పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపై చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై చర్చ జరుగనుంది. స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సిఎం బృందం సందర్శించనుంది. సిఎం చంద్రబాబుతో మంత్రులు నారా లోకేష్, టిజి భరత్, పి.నారాయణ, వివిధ శాఖల అధికారులు సింగపూర్ పర్యటనలో పాల్గొననున్నారు.