ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జర్లాడ్ తో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరోప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజా లతో భేటీ అవనున్నారు. రోల్స్ రాయస్ గ్రూప్ సీటీఓ నిక్కి గ్రేడి స్మిత్ తో, ఎస్రామ్, ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీతోను, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో సమావేశమవనున్నారు.
అనంతరం లండన్ లోని పారిశ్రామికవేత్తలతో సీఎం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానించనున్నారు. సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశానికి బ్రిటిష్ హెల్త్ టెక్ పరిశ్రమల అసోసియేషన్ ఎండీ పాల్ బెంటన్, ఏఐపాలసీ ల్యాబ్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫైన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదిలావుంటే.. లండన్ లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాయంత్రం భేటీ కానున్నారు.