ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు..సీఎం కీలక ప్రకటన
రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు.
By - Knakam Karthik |
ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు..సీఎం కీలక ప్రకటన
అమరావతి: రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు. దీనికి అనుగుణంగానే పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ధాన్యం సేకరణ, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సమీక్ష నిర్వహించారు. వర్చువలుగా మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఈ సమీక్షకు హజరయ్యారు.
రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఎలాంటి పంటలు వేయాలి.. రైతులకు ఏది ప్రయోజనం అన్న అంశాలను రైతుల్లో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచటంతో పాటు కోత సమయంలోనూ తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు. కోల్డ్ చైన్ సహా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను తరలించటంతో పాటు ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేలా రైల్ కార్గో లాంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను కల్పించాలని అన్నారు. వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యల్ని పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈమేరకు సమీక్ష నుంచే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్ తో ముఖ్యమంత్రి మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని సీఎం బ్యాంకర్లను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని సీఎం సూచనలు జారీ చేశారు.