తగినన్ని నిధులు ఇస్తాం.. సీజనల్ వ్యాధులు ప్రబలటానికి వీల్లేదు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తగినంత మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Medi Samrat
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తగినంత మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అంశంపై ఆయన మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దోమల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రాంతాలలో ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలన్నారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల ను వినియోగిస్తూ పిచికారి చేయించాలన్నారు. మానవ తప్పిదాల వల్ల ఈ వ్యాదులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ శాఖలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ ఇటువంటి కేసు ప్రబలినా ఆ కేసు పై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
తాగునీరు కలుషితం ద్వారా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, తాగునీరు కలుషితం కాకుండా తగు ముందస్తు చర్యలను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల బోర్లు ఉన్నాయని, వాటన్నిటిని ముందుగానే ఫ్లష్ అవుట్ చేయించాలన్నారు. అయినప్పటికీ త్రాగునీరు కలుషితానికి అవకాశం ఉంటే, ఆయా బోర్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో నూతన బోర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ నీరు కలుషితం కావడానికి వీల్లేదని, ఇందుకై ప్రోటోకాల్ ప్రకారం ఎస్ఓపిని పటిష్టంగా అమలుపరచాలని ఆదేశించారు.
అదేవిధంగా త్రాగునీటి పైపుల లీకేజీకి ఏ మాత్రం అవకాశం లేకుండా చూడాలని, ప్రత్యేకించి మురుగునీరు, వర్షపు నీటికి త్రాగు నీటి సరఫరా పైపులు ఏమాత్రం ఎక్స్పోజ్ కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్రాగు నీటి వనరులన్నిటిని ముందుగానే క్లోరినేషన్ చేసుకునే అంశంపై మున్సిపాలిటీ మరియు పంచాయతీరాజ్ శాఖలు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పరిపాలన పరమైన లోపాల వల్లే సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని,అందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అవసరమైన నిధులను తగినంత మొత్తంలో మంజూరు చేస్తామని, తాగునీరు మాత్రం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఆహారం కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మన పై ఉందని, ఇందుకు వ్యవసాయ, పౌరసరాలు, ఆరోగ్య శాఖల మంత్రుల బృందం ఈ అంశాన్ని ఇప్పటికే పర్యవేక్షిస్తున్నది అన్నారు. సురక్షితమైన ఆహార సరఫరా అంశాన్ని కూడా ఈ బృందమే పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ మూడు నెలల పాటు వడదెబ్బకు ఎక్కువగా గురి అయ్యే అవకాశాలు ఉన్నందున, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సాటించాలన్నారు. చల్లని నీటిని సరఫర చేసే చలివేంద్రాలను పెద్ద యెత్తున ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ఓఅరెస్ ప్యాకెట్లను, మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేయాలన్నారు. బహిరంగ మలవిసర్జనకు ఏ మాత్రం లేకుండా, వ్యక్తిగత టాయిలెట్లు ఉపయోగించుకునేలా చైతన్య పరచాలని, అవసరమైన చోట్ల వ్యక్తిగత టాయిలెట్స్ ను వెంటనే మంజూరు చేసి వాటి నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.