గుడ్న్యూస్.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేతే అత్యంత కీలకమైన రంగంగా ఉందని.. దీని మీద ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ మేరకు ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో చంద్రబాబు ప్రస్తావించారు. మగ్గాలకు 200 యూనిట్లు.. అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఈ సమీక్షలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించేందుకు సిద్దమైంది. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల చేనేత రంగం పుంజుకుంటుందని... తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. దీని వల్ల చేనేత వస్త్రాలకు విక్రయాలు పెరిగి నేతన్నలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం రూ. 5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో చేనేత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయి...వన్ డిస్ట్రిక్..వన్ ప్రొడక్ట్ విభాగంలోనూ మొదటిసారి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను సమీక్షకు ముందు సీఎం చంద్రబాబుకు అధికారులు చూపించారు.