సింగపూర్ పర్యటనలో 3వ రోజూ సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు.
By Medi Samrat
సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ తోనూ భేటీ అవుతారు. అలాగే సింగపూర్ లోని వివిధ ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం :
ఉదయం 7.30 గంటలకు ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 8 గంటలకు మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచశ్రేణి కంపెనీ మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ, రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుపుతారు. ఉదయం 8.30 గంటలకు ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీలో మేటి సంస్థ అయిన క్యారియర్ ప్రతినిధులతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు జరుపుతారు. ఉదయం 9 గంటలకు ప్రపంచంలోని అతిపెద్ద అగ్రిగల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై సీఎం చర్చించనున్నారు.
బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశం
మరోవైపు ఉదయం 9.30 గంటలకు షాంగ్రీలాలో జరిగే బిజినెస్ రౌండ్టేబుల్, నెట్వర్కింగ్ లంచ్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్...థీమ్పై చర్చిస్తారు. ఎస్టీటీ జీడీసీ, కాంటియర్ సిస్టమ్స్, ఆరియన్ప్రో, ఆంకోషాట్, వాటర్లీప్, జీటీఎఫ్ఎన్, ఫాదమ్ ఎక్స్, ఏస్ డాట్ ఎస్జీ తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి బేటీ అవుతారు. ఏపీకి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సింగపూర్ భాగస్వామ్యం అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు సింగపూర్ మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్తో సమావేశం అవుతారు. పారదర్శక పాలన, స్మార్ట్ సిటీ అభివృద్ధిలో సింగపూర్ అనుభవాన్ని రాష్ట్రానికి అందించడంపై చర్చిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సందర్శించనుంది. పారిశ్రామిక వాడల్లో నివాస ప్రాంతాలు, లాజిస్టిక్స్ హబ్ ల ఏర్పాటు పై అధ్యయనం చేయనున్నారు. అనంతరం టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశమై వాహన తయారీ రంగం, ఆటోమొబైల్ పార్కులపై చర్చిస్తారు. అనంతరం బిజినెస్ నెట్వర్కింగ్ పై ఏర్పాటు చేసిన విందు సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ పెట్టుబడులపై సీఎం చర్చించనున్నారు.