గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది.

By Medi Samrat
Published on : 26 Jun 2025 7:37 PM IST

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినదించింది. డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. గుంటూరులో ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యార్ధినీ విద్యార్ధులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ పట్టుకుని సీఎం నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిస చేసి... సమాజాన్ని పీడిస్తున్న మాఫియాను తరిమేద్దామని సీఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే ఆస్తుల జప్తే

ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. “అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంది. ఈ తరహా సమస్యలు పెరిగితే ఇబ్బందులు వస్తాయి. గంజాయి రవాణ, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నా. సాగుచేసినా, బయట నుంచి తీసుకువచ్చి విక్రయించినా సహించేది లేదు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపాం. ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. టెక్నాలజీతో డ్రోన్లు వినియోగించి నేర నియంత్రణ చేస్తున్నాం, సీసీటీవీ కెమెరాలతో నేరాలు జరక్కుండా చూస్తున్నాం. కేసులు పెట్టడమే కాదు.. గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు కూడా జప్తు చేస్తాం. జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు.. అవగాహన కల్పించేందుకు వినియోగిస్తాం.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

డ్రగ్స్, గంజాయి సమస్య కూటమికి వారసత్వంగా వచ్చింది

గత ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు గుర్తు చేశారు. “వైసీపీ హయాంలో డ్రగ్స్ కు నిలయంగా రాష్ట్రం మారిపోయింది. విశాఖ కేంద్రంగా గంజాయి రవాణా చేశారు. ఆంద్రా బ్రాండ్ ను దెబ్బ తీశారు. గత ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా మాదక ద్రవ్యాల నివారణపై సమీక్ష చేయలేదు. గంజాయి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమమూ చేపట్టలేదు. డ్రగ్స్ గురించి పోరాడితే కేసులు పెట్టారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల గంజాయి, డ్రగ్స్ సమస్య కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. కష్టనష్టాలను ఎదుర్కోంటూ రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యతను తీసుకున్నాం. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. కానీ గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లతో మాజీ సీఎం చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. వారిని ప్రొత్సహిస్తున్నారు.. పరామర్శిస్తున్నారు. రాజకీయ ముసుగు వేసుకుంటే దాన్ని తొలగించి కట్టడి చేస్తాం. గంజాయి విక్రయించేవారిని.. వారికి సహకరించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రతిపక్షాలూ ముందుకు రావాలి. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయించుకోవాలి. అంతే కానీ.. గంజాయి బ్యాచ్ ను సపోర్టు చేస్తూ తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు.” అని ముఖ్యమంత్రి హితవు పలికారు.

మత్తులో మానవ మృగాలుగా మారుతున్నారు

గంజాయి, డ్రగ్స్ బారిన పడి యువత నిర్వీర్యమవుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మనిషి మృగంగా మారతాడు. గంజాయి, డ్రగ్స్ సేవించే వ్యక్తులు సమాజానికి, తల్లితండ్రులకు పెద్ద సమస్యగా మారతారు. పిల్లలు, తల్లులు, చెల్లెళ్ల పైనా దాడులు చేస్తున్నారు. మూడేళ్ల పసికందులపైనా మానవ మృగాల్లా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీళ్లను ఎలా క్షమిస్తాం.? ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. 2047కి తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అందుకే ఇప్పటి నుంచే గంజాయి వంటి సమస్యల్ని పరిష్కరించుకుని ముందడుగు వేయాలి.” అని సీఎం అన్నారు.

మత్తు నుంచి యువతను బయటకు తెస్తాం

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను బయటకు తెచ్చేలా కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. “దేశంలో ఉత్పత్తి అవుతున్న గంజాయిలో ఒడిశా, ఏపీలోనే 50 శాతం సాగు అవుతోంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల గంజాయికి కేంద్రంగా విశాఖ ఉండటం అత్యంత బాధాకరం. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంలో 2 శాతాన్ని మాదకద్రవ్యాల నియంత్రణకు ఖర్చు చేస్తున్నాం. మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నాం. విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతిలలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాం. అన్ని జిల్లాల్లోనూ నార్కోటిక్స్ కంట్రోల్ సెంటర్లు పెట్టాం. పాఠశాలల్లో ఈగల్ క్లబ్పులు ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయీ ప్రమాణాలతో మూడు ప్రాంతాల్లో డీ-అడిక్షన్ సెంటర్లతో పాటు.. రాష్ట్రంలో 56 డీఅడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం. గంజాయి నివారణకు ప్రజలూ సహకరించాలి. సెలబ్రిటీలు కూడా వీటికి వ్యతిరేకంగా ప్రజాచైతన్యం కోసం ప్రచారం చేయాలి. కోదాడ వద్ద జరిగిన ఓ ఘటనలో ఓ తల్లిపడిన ఆవేదన చాలా బాధ కలిగించింది.” అని చంద్రబాబు అన్నారు.

డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదులకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లు

మత్తుపదార్ధాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత తీసుకోవడమే కాదని.. దీనికి ప్రజా మద్దతు కూడా అవసరమని చంద్రబాబు అన్నారు. ప్రజా పోలీసింగ్ ద్వారానే డ్రగ్స్, గంజాయిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టగలమని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటు చేసిన ఈగిల్ టాస్క్ ఫోర్సు ఫిర్యాదుల కోసం వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్ ప్రీ, వాట్సప్ నెంబరును ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. టోల్ ఫ్రీ నెంబరు 1972, వాట్సప్ నెంబరు 8977781972లను సీఎం విడుదల చేశారు. ఈ నెంబర్లకు సమాచారం అందించి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నివారణకు పని చేసిన వివిధ వ్యక్తులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు సన్మానించారు.

Next Story