ఈ నెలలోనే ఆర్థిక సాయం.. రైతులకు సీఎం చంద్రబాబు తీపికబురు
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజల నిరంతర మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని హామీ ఇచ్చారు.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రజల నిరంతర మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పోస్టు చేశారు.
"సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, 'పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, 'మత్స్యకార సేవలో'...లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు.. పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని గుడ్న్యూస్ చెప్పారు. ‘అన్నదాతా సుఖీభవ కింద రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ. 20 వేలు ఖాతాల్లో వేస్తాం. ఈ పథకం కూడా ఈనెల 20న అమలు చేస్తాం. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. వాళ్లకు మాకు వ్యత్యాసం రూ.6,500 అని పేర్కొన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాం. మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది...మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను." అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.