తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని రాష్ట్ర మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik
తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని రాష్ట్ర మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో సీఎం మాట్లాడుతూ..ఒకప్పుడు నేరస్థులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు, ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్ధం కావట్లేదని దుయ్యబట్టారు.
మంత్రులతో సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
అదే సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనమూ వేధించటం సరికాదన్నారు.
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందన్నారు. నేరం రుజువయ్యాక ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించటమే తమ విధానమన్న చంద్రబాబు, రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని..సీఎం చంద్రబాబు సూచించారు.