రేపు వేమూరులో సీఎం పర్యటన.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
By - Medi Samrat |
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తారు. గత ముఖ్యమంత్రి పొలం హద్దుల కోసం పాతే రాళ్లపైనా, రైతులకు ఇచ్చే పట్టాదారుపుస్తకాలపై తన ఫోటోలను ముద్రించుకున్నారు. వీటన్నింటినీ కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తైంది. ఈ ఏడాది చివరి నాటికి రీ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. దీంతో పాటు ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తోంది. జనవరి నెలలో 4,783 గ్రామాల్లో 18.77 లక్షల పాస్ పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16,129 పాస్ పుస్తకాలు, మార్చిలో 299 గ్రామాల్లో 1,29,298 పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. జనవరి నుంచి 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం అందించింది. మార్చి 2027 నాటికి 7,518 సిగ్నల్ గ్రామాల్లో 47,02,000 పాస్ పుస్తకాలు, ఏప్రిల్ 2027 కల్లా 2,438 నాన్ సిగ్నల్ గ్రామాల్లోని 15,02,000 పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62,04,000 పాస్బుక్స్ కొత్తవి ఇవ్వాల్సి ఉంది. బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, అలాగే వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 1,795 పాస్ పుస్తకాలను గురువారం పంపిణీ చేయనున్నారు. అంతేకాదు.. రైతులకు తెలియకుండా భూ రికార్డులు మార్పిడి చేయలేని విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ చైన్ టెక్నాలజీనీ అమల్లోకి తెస్తోంది. ఈ విధానం ద్వారా రికార్డులు ట్యాంపర్ చేయాలన్నా, తారుమారు చేయాలన్నా అసాధ్యం.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేమూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా... ఉదయం 10.50 గంటలకు భట్టిప్రోలు మండలం, సూరేపల్లికి చేరుకుంటారు. 11.00 గంటలకు సూరేపల్లిలో నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడతారు. 02.10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 04.05 గంటలకు అమరావతి చేరుకుంటారు.