పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By - Knakam Karthik |
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు, 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CM APP మరియు ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన Kapas Kisan App ను రాష్ట్ర CM APP తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Kapas Kisan App నుండి CM APP కు రైతుల వివరాలు రియల్ టైమ్లో సమన్వయం అయ్యేలా చేయాలి. రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలి..అని లేఖలో తెలిపారు.
రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా. L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. Kapas Kisan App కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలి. వాతావరణ ప్రభావం వల్ల తేమ శాతం 12 నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలి. వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధరకు కొనుగోలు చేయాలి. ఈ చర్యలు రైతులలో ఉన్న అసంతృప్తిని తగ్గించి, పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్న మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.