ఏపీలోని కర్నూలు జిల్లాలో సిద్ధమవుతున్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనికి ఏపీని అభినందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో సింగరేణి బొగ్గు, ధర్మల్ పవర్తో పాటు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని ఆలోచిస్తున్నామని అందుకోసమే, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో 2029-30 నాటికల్లా కనీసం 20 వేల మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. ఏపీలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును భట్టి విక్రమార్క సందర్శించారు. పాణ్యం మండలం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉందని, రానున్న రోజుల్లో పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు.