రాజధాని ఏ ఒక్కరికో, ఒక వర్గానికో పరిమితం కాదు : ఏపీ హైకోర్టు

AP High Court gives Green Signal for Amaravati R5 Zone. అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

By Medi Samrat  Published on  5 May 2023 11:56 AM GMT
రాజధాని ఏ ఒక్కరికో, ఒక వర్గానికో పరిమితం కాదు : ఏపీ హైకోర్టు

అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్‌-5 జోన్‌ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రెండు రోజుల క్రితం వాదనలు ముగిశాయి. అమరావతి రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని.. పిటిషన్‌ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో, ఒక వర్గానికి పరిమితం కాదని సీజే అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే అని అన్నారు. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదని ధర్మాసనం తెలిపింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీయే కిందకు వస్తాయని.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో, కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారని, నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని అన్నారు. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగమని హైకోర్టు అభిప్రాయపడింది.

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు భూబదలాయింపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగించే తీర్పును ఇచ్చింది.


Next Story