వైద్యుల నియామకాల్లో కొత్త చ‌రిత్ర‌ : మంత్రి విడ‌ద‌ల ర‌జిని

AP Health Minister Vidadala Rajini. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కు అన్ని ఆస్ప‌త్రుల్లో సిబ్బంది నియామ‌కం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం

By Medi Samrat  Published on  20 Jan 2023 1:50 PM GMT
వైద్యుల నియామకాల్లో కొత్త చ‌రిత్ర‌ : మంత్రి విడ‌ద‌ల ర‌జిని

గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కు అన్ని ఆస్ప‌త్రుల్లో సిబ్బంది నియామ‌కం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వైద్య ఆరోగ్య‌శాఖ కు సంబంధించిన అన్ని విభాగాల అధిప‌తుల‌తో శుక్ర‌వారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద‌ల‌కు మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా, వేగంగా అందించేందుకు జ‌గ‌న‌న్న చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల్లో స‌రిప‌డా సిబ్బందిని ఉంచేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేద‌ని తెలిపారు. నెల‌కు రూ.3 ల‌క్ష‌ల‌కు కంటే కూడా ఎక్క‌వ చెల్లించేలా బిడ్డింగ్ పద్ధతి ద్వారా నిపుణులైన వైద్యుల నియామకం చేప‌డుతున్న ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్ప‌త్రుల వ‌ర‌కు ఎక్క‌డా సిబ్బంది కొర‌త లేకుండా చూడాల్సిన బాధ్య‌త ఉన్న‌తాధికారుల‌పై ఉంద‌ని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా సిబ్బంది ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు.

ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వివ‌రాల‌న్నీ ప‌క్కాగా ఉండాలి

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన సంచ‌ల‌న కార్య‌క్ర‌మాల్లో ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానం కూడా ఒక‌ట‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ విధానం కోసం అభివృద్ధి చేసిన యాప్‌ల‌లో డేటా ఎంట్రీ ప‌క్కాగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తి ఎంఎంయూ ద్వారా అందించిన ఓపీ సేవ‌ల సంఖ్య‌, చేసిన వైద్య ప‌రీక్ష‌లు, పంపిణీ చేసిన మందులు.. వీట‌న్నింటినీ ప‌క్కాగా న‌మోదు చేయాల‌ని సూచించారు. ఆన్‌లైన్‌లో ఉన్న డేటాతో .... ఈ వివ‌రాల‌న్నీ స‌రిపోలేలా ఉండాల‌ని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానంలో భాగంగా వైద్యాధికారులు త‌ప్ప‌కుండా అంగ‌న్‌వాడీ కేంద్రాలు, పాఠ‌శాళ‌ల‌ల‌ను సంద‌ర్శించాల్సిందేన‌ని, ఈ వివ‌రాల‌న్నీ ఆన్‌లైన్‌లో న‌మోదుకావాల‌ని సూచించారు. ఈ నూత‌న వైద్య విధానం కోసం అతి త్వ‌ర‌లో మ‌రో 260 ఎంఎంయూల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు.

రోగుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందాలి

రాష్ట్ర వ్యాప్తంగా రోగుల‌కు అన్ని ఆస్ప‌త్రుల్లో నాణ్య‌మైన భోజ‌నం అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 2012 త‌ర్వాత తొలిసారి డైట్ బిల్లులు భారీగా పెంచిన ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని గుర్తుచేశారు. గ‌తంలో కేవ‌లం రూ.40 మాత్ర‌మే చెల్లించేవార‌ని, జ‌గ‌న‌న్న ఇప్పుడు రూ.80 చెల్లిస్తుర‌న్నార‌ని తెలిపారు. పేద‌ల‌కు మంచి చేసే విష‌యంలో జ‌గ‌న‌న్న ఎప్పుడూ ముందుంటార‌ని పేర్కొన్నారు. అన్ని ఆస్ప‌త్రుల్లో మందులు క‌చ్చితంగా అందుబాటులో ఉండాల‌ని చెప్పారు. శ‌స్త్ర‌చికిత్స‌లు అందించే విష‌యంలో రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కూడ‌ద‌ని చెప్పారు. వైద్య పరీక్ష‌లు చేసేందుకు కావాల్సిన అన్ని రియేజంట్లు ఆస్ప‌త్రుల్లో అందుబాటులో ఉండాల‌న్నారు.

ఏఎన్ఎం ల అభిప్రాయాలు తీసుకోండి

ఆరోగ్య‌శ్రీ ద్వారా బిల్లులు చెల్లించే స‌మ‌యంలో ఆయా ఆస్ప‌త్రుల ప‌రిధిలోని ఏఎన్ ఎంల అభిప్రాయాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశించార‌ని, ఆ మేర‌కు ప‌కడ్బందీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయాల‌ని అధికారుల‌ను మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశించారు. అన్ని ఆరోగ్య శ్రీ ఆస్ప‌త్రుల్లో కియోస్క్‌లు క‌చ్చితంగా ఉండేలా చొర‌వ‌చూపాల‌న్నారు. ఈ ఏడాది ఎన్ ఎం సీ ప‌ర్యటించ‌నున్న నూత‌న వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి అన్ని సౌక‌ర్యాలు ఉండేలా చూడాల‌ని సూచించారు. పీఈబీ నిర్మాణాల‌ను వెంట‌నే పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే అన్ని క‌ళాశాల‌ల కోసం సిబ్బంది నియామాకాలు కూడా పూర్త‌య్యాయ‌న్నారు. విజయవాడలో సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీ వినియోగానికి సంబంధించి ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. నాడు- నేడు, ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం త‌దిత‌రాల‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు.

Next Story