ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!

డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

By అంజి
Published on : 7 Jun 2025 9:30 AM IST

AP government , scheme, education, children , dwcra women, APnews

ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!

అమరావతి: డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుల కోసం కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) పరిధిలోని స్త్రీనిధి బ్యాంక్‌ ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు 4 శాతం (35 పైసలు) వడ్డీకే రుణాలు అందించనుంది. గవర్నమెంట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థుల తల్లులకు ఇది వర్తిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని గరిష్ఠంగా 36 నెలల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను కూటమి ప్రభుత్వం త్వరలోనే తెలియజేయనుంది. పిల్లలను చదివించడానికి డబ్బుల్లేక బయట నుంచి ఎక్కువ వడ్డీలకు తెచ్చి చాలా మంది తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతున్నారు. ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు మరో పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి 'ఎన్టీఆర్‌ విద్యా సంకల్పం'గా నామకరణం చేస్తూ అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకం త్వరలోనే అమల్లోకి రానుంది. పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను రూపొందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Next Story