ఆంధ్రప్రదేశ్: కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు షర్మిల ఎక్స్లో స్పందించారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు.
శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదు. మూడ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదు. కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించండి. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపండి. రూ. 3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టండి..అని షర్మిల డిమాండ్ చేశారు.