వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik
వక్రబాష్యం చెప్పేలా వారి పాలన, వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకే దక్కుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు షర్మిల ఎక్స్లో ఇలా రాసుకొచ్చారు.. ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు గారి ఏడాది పాలన. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారు. సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిలేశారు. అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారు. నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారు. కరెంటు బిల్లుల పేరిట జనాల జేబులకు చిల్లులు పెట్టారు. విభజన హామీలకు దిక్కులేదు. ప్రత్యేక హోదా అడగలేదు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదు. అన్యాయమని ప్రశ్నించలేదు. విశాఖ స్టీల్ ప్లాంటును ఉద్ధరిస్తామని చెప్పి, 4 వేల మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు తీరని అన్యాయం చేశారు. ఇవ్వాళ ప్రజా తీర్పు దినం కాదు.. "ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం". నమ్మకం పేరుతో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను వంచించిన దినం..అని షర్మిల విమర్శించారు.
ఇక వెన్నుపోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్.... ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి. వైసీపీ నిర్వహించే 'వెన్నుపోటు దినం' కార్యక్రమానికి ఎలాంటి అర్థం లేదని, రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆమె పరోక్షంగా జగన్ను ఉద్దేశించి చురకలంటించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే, వాటిపై విపక్ష నేతగా పోరాడాల్సిన జగన్ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల విమర్శించారు. "ఏడాది కాలంగా చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే, మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ, పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెబుతుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష హోదా కోసం మారాం చేయడం కూడా వెన్నుపోటే" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
జూన్ 4: ఉన్మాద,అవినీతి,అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు @ncbn గారి ఏడాది పాలన. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో…
— YS Sharmila (@realyssharmila) June 4, 2025