ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్కు మధ్య పెద్ద తేడా లేదు ..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గతంలో కుప్పంలో వైసీపీ చేసిందే... ఇప్పుడు పులివెందులలో టీడీపీ చేసింది. షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. జగన్, చంద్రబాబు పెద్ద తేడా లేదు. కుప్పంలో ఆనాడు జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. ఈనాడు పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..అని షర్మిల ఆరోపించారు.
ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎన్నికల్లో తాలిబన్ల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. మరో వైపు మోదీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఇద్దరు నాయకులు నోరు ఎత్తడం లేదు. ఎందుకంటే ఒకరిది బహిరంగ పొత్తు. మరొకరిది అక్రమ పొత్తు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీకి ఊడిగం చేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. అధికారంలోకి రావాలి...అని షర్మిల వ్యాఖ్యానించారు.