ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik
ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా పలు అంశాలపై చర్చించింది. ఇప్పటి వరకు 25 కాగిత రహతంగా ఈ-క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడంపై సీఎం చంద్రబాబును మంత్రి మండలి అభినందించింది. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రగతికి దిశానిర్థేశం చేసేటటువంటి ఎన్నో కీలక, సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారంటూ ముఖ్యమంత్రి, వారి దార్శనికతను మంత్రి వర్గం అభినందించింది. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర ఐటి, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ కి మంత్రి మండలి అభినందలు తెలిపింది. అనంతరం పలు అంశాలపై కూలంకశంగా చర్చించి ఆమోద ముద్ర వేసింది.
ఏడాది పాలనపై సమీక్షించుకోవడం సహా పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు చేసింది. సత్ప్రవర్తన కల్గి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అర్హత కలిగిన 17 మంది యూవజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రకటించింది. పోలీసు శాఖలో పలువురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించింది. రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసిన మంత్రి వర్గం, 50 ఎకరాల భూములు కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అత్యధిక మందితో యోగా చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నమోదు చేయించాలని తీర్మానించింది..
ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలకు ఆర్ఓ ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం రూ.5.75 కోట్ల ను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద విడుదలకు ఆమోదం తెలిపింది. అదే విధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో నీటి కొరత ఉన్న 533 జనావాస ప్రాంతాల్లో 15 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు రూ.8.22 కోట్ల రూపాయలను వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద విడుదలకు ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపుకొట్టూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందస తదితర ఏడు మండలాల్లో సీతంపేట మండలంలోని ఆదివాసీ ప్రాంతాలతో సహా 341 జనావాసాల్లోని 2.42 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుందని తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 533 జనావాసాల్లోని 2.85 లక్షల మంది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని మంత్రిమండలి తెలిపింది.
యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసిన దృష్ట్యా ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. క్షమాభిక్ష ద్వారా విడుదలైన తదుపరి ఖైదీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రొబేషన్ అధికారి, దాని పరిధిలోని పోలీస్ స్టేషన్లో హాజరుకావాలసి ఉంటుందని, ఒకవేళ ఏదైనా నేరం చేస్తే క్షమాభిక్ష రద్దవుతుందని మంత్రి పార్థసారధి వెల్లడించారు. APSPFలో 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్లుగా పదోన్నతి ఇవ్వడానికి, హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.