'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

By అంజి  Published on  4 July 2024 10:15 AM GMT
Andhrapradesh, CM Chandrababu, PM Modi, financial assistance, APnews

'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి: రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన సహాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సాయం అందించాలని కోరారు.

2024-25కి సంబంధించి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ఈ నెలాఖరులో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నందున, రాష్ట్ర అవసరాలను సీఎం చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కీలక భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. జూన్ 13న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి.

ప్రధానితో భేటీకి ముందు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సీఎం చంద్రబాబు కలిశారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధిలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఎలా సహాయపడుతుందో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కూడా కలిసే అవకాశం ఉంది.

Next Story