ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

Andhra Pradesh MLC Elections. రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు మరియు మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను

By Medi Samrat  Published on  12 March 2023 3:45 PM GMT
ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

Andhra Pradesh MLC Elections


రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు మరియు మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను 13 వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా కూడా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆదివారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం జరుగబోయే ఎన్నికలకు సంబందించిన సమాచారాన్ని వివరించారు.

రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు మూడు పట్టభద్రుల నియోజక వర్గ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గ స్థానాలకు మరియు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలు స్థానిక సంస్థల నియోజక వర్గ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుచున్నాయన్నారు.

అనంతపూర్, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు స్థానిక సంస్థల నియోజక వర్గ స్థానాలకు వైఎస్సార్సిపి అభ్యర్థులు మినహా ఇంకా ఏ ఒక్కరూ ఈ స్థానాలకు పోటీ చేయకపోవడం వల్ల వైఎస్సార్సిపి అభ్యర్థులు ఏకగ్రీవ ఎంపికైన్లటు ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతపూర్ స్థానిక సంస్థల నియోజక వర్గానికి ఎస్ మంగమ్మ, కడప స్థానిక సంస్థల నియోజక వర్గానికి రామ సుబ్బారెడ్డి పొన్నపురెడ్డి, నెల్లూరు నియోజక వర్గానికి మెరిగ మురళీధర్, తూర్పు గోదావరి నియోజక వర్గానికి కుడిపూడి సూర్యనారాయణ రావు, చిత్తూరు స్థానిక సంస్థల నియోజక వర్గానికి సుబ్రహ్మణ్యం సిపాయి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించడం జరిగిందన్నారు.

సోమవారం జరుగబోయే ఎన్నికల్లో 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది, 2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 10,00,519 పట్టభద్రులైన ఓటర్లు, రెండు ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల్లో 55,842 మంది ఓటర్లు, మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో 3,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికకు 1,172 పోలింగ్ స్టేషన్లను, 2 ఉపాధ్యాయ స్థానాల ఎన్నికకు 351 పోలింగ్ స్టేషన్లను మరియు 3 స్థానిక సంస్థల స్థానాల ఎన్నికలకు 15 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగిందని, వీటిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెలుపల కూడా వీడియోగ్రఫీని చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎపిక్ తోపాటు పది రకాల గుర్తింపు కార్డుల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికలు జరిగే 13 వ తేదీ, ఓట్ల లెక్కింపు జరిగే 16 వ తేదీల్లో ఏ కేంద్రాల్లో అయితే ఈ పక్రియ జరుగుతుందో ఆ కేంద్రాల్లో అవసరాన్ని బట్టి స్థానికంగా సెలవు దినాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. అదే విధంగా 13 వ తేదీ జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్పెషల్ క్యాజువల్ లీవ్లు / పర్మిషన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో బ్యాలెట్ ప్యాపర్ పై వైలెట్ కలర్ ఇంక్ పెన్ ద్వారానే సంఖ్యలను గుర్తిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం 4.00 గంటల కల్లా పోలింగ్ ముగుస్తుందని, అయితే 4.00 గంటల కల్లా ఎవరైతే క్యూలైన్లో ఉంటారో వారందరికీ స్లిప్లను అందజేసి ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఎన్నికలను కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమైందన్నారు. ఎన్నికల ప్రక్రియను లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ నెల 11 వ తేదీ 4 గంటల నుండి 13 వ తేదీ 4 గంటల వరకూ 48 గంటల పాటు ఎన్నిక ప్రచారాన్ని నిషేదించడం జరిగిందన్నారు. మొత్తం ఎనిమిది నియోజక వర్గాలకు జరిగే ఎన్నికలకు ఎనిమిది కౌటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 16 వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ రూ.77.48 లక్షల నగదు, 1,02,819.05 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా 64 ఎక్సైజ్ కేసులు బుక్ చేసి 75 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. 7,380 లైసెన్సుడ్ ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందని, ముందు జాగ్రత్త చర్యగా 1,941 ప్రివెన్టివ్ కేసులను పెట్టడం జరిగిందని, 7,266 మందిని ఆదీనంలోకి తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.


Next Story