భారత ఆర్మీ సంచలన నిర్ణయం.. 89 యాప్‌లు తొలగింపు

By సుభాష్  Published on  9 July 2020 7:12 AM GMT
భారత ఆర్మీ సంచలన నిర్ణయం.. 89 యాప్‌లు తొలగింపు

భారత్‌లో యాప్‌ల బ్యాన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే జిత్తులమారి డ్రాగన్‌.. చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిని ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది కేంద్రం సర్కార్. భారత్‌ - చైనా సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ తనదైన శైలిలో చైనాకు దడపుట్టిస్తోంది. గాల్వన్‌ లోయలో భారత్‌ -చైనా సైనికుల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దీంతో చైనాకు ఒక్కొక్కటిగా ఝలక్‌ ఇస్తూ వస్తోంది భారత్‌. ఇప్పుడు ఇండియన్‌ ఆర్మీ కూడా చైనాకు షాకిచ్చింది.

ఫేస్‌ బుక్‌తో సహా మొత్తం 89 యాప్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 89 రకాల యాప్‌ల నుంచి ఆర్మీ బయటకొచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్మీ 89 యాప్‌ల జాబితాను విడుదల చేసింది. ఆర్మీలో పని చేస్తున్న సైనికులు జూలై 15వ తేదీలోగా నిషేధించిన యాప్‌ల అకౌంట్లను తొలగించాని భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.

ఒక వేళ అకౌంట్లను తొలగించకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్మీ స్పష్టం చేసింది. ఆర్మీ సూచించిన యాప్స్‌ జాబితాలో చైనాకు చెందిన యాప్స్‌ తో పాటు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌ చాట్‌, డైలీ హంట్‌, షేర్‌ ఇట్‌, ట్రూ కాలర్‌, పబ్‌జీ, టిండర్‌ తదితర యాప్స్‌ కూడా ఉండటం గమనార్హం.

భారత్‌ దెబ్బకు తోకముడిచిన డ్రాగన్‌ కంట్రీ

భారత్‌ – చైనా సైనికుల ఘర్షణల నేపథ్యంలో చైనా సైన్యం భారత్‌ భయానికి తోకముడిచింది. రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. లడఖ్‌ లోని గాల్వన్‌ లోయ నుంచి నిజంగానే చైనా సైన్యం వెనక్కివెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జిత్తులమారి డ్రాగన్‌ చెబుతున్నది ఒకటి.. చేసేది ఒకటి ఉంటుంది. కాని తాజాగా శాటిలైట్‌ చిత్రాలు విడుదలయ్యాయి. వాటి ద్వారా చైనా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడున్న టెంట్లు, శిబిరాలను తొలగించించింది. రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గాల్వన్‌ లోయలో ఇండియా , చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.

భారత్‌ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం యాప్స్‌ పైనే కాదు.. హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రోత్సహించదని కేంద్ర స్పష్టం చేశారు. త్వరలోనే హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆ విధానంలో హైవే ప్రాజెక్టులో పాల్గొనేలా భారత్‌ కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా సడలింపు చేపడతామన్నారు. ఇలా ఒక్కొక్కటిగా చైనాకు భారత్‌ తనదైన శైలిలో దెబ్బకొట్టడంతో చైనాకు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో పడిపోయింది.



Next Story