'వైఎస్ఆర్‌ నవశకం' నేటి నుంచి ఇంటింటి సర్వే ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 6:25 AM GMT
వైఎస్ఆర్‌ నవశకం నేటి నుంచి ఇంటింటి సర్వే ..!

ముఖ్యాంశాలు

  • ఏపీలో'వైఎస్ఆర్ నవశకం'పేరుతో సర్వే
  • వాలంటీర్ల ద్వారా సర్వే చేపట్టనున్న ప్రభుత్వం
  • డిసెంబర్ 20 వరకు కొనసాగనున్న సర్వే
  • అర్హులను గుర్తించేందుకే సర్వే అన్న ప్రభుత్వం
  • జనవరి 15 నుంచి 18 వరకు గ్రామసభల్లో సర్వే ఫిర్యాదులు సేకరణ
  • మూడు కార్డులు కాకుండా ఒకే కార్డు ఇవ్వాలంటోన్న ప్రజలు

అమరావతి: అర్హులందరికీ నవరత్నాలు అందించే లక్ష్యంతో 'వైఎస్సార్ నవశకం' పేరిట... గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటి సర్వే చేపట్టనుంది. డిసెంబర్‌ 20 వరకూ సర్వే చేస్తారు. అనంతరం... డిసెంబర్‌ 21 నుంచి 31 వరకూ సమాచారాన్ని మండల స్థాయిలో కంప్యూటరీస్తారు. జనవరి 2 నుంచి 7 వరకూ అనర్హుల గుర్తింపు, పునఃపరిశీలన చేస్తారు. 8న అర్హుల జాబితా ముద్రించి... 9వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. జనవరి 11 నుంచి 13 వరకూ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. 15 నుంచి 18 వరకూ గ్రామ సభలు నిర్వహించి ఫిర్యాదులు పరిశీలించనున్నారు.

ఈ సర్వే పూర్తయ్యాక... రేషన్‌ బియ్యానికి ఓ కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరొకటి, కుటుంబానికో ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వనున్నారు. రేషన్‌ బియ్యానికి విడిగా కార్డులు ఇవ్వడం వల్ల... అక్రమ దందాకు అడ్డుకట్ట పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా... కొత్తగా అమలు చేయబోయే పథకాలకు అర్హులను గుర్తించి, ఆయా పథకాలకు సంబంధించి విడివిడిగా కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.అమ్మఒడి, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షల శిక్షణకు హాజరయ్యేలా జగనన్న విద్యాకార్డును ప్రభుత్వం అందించనుంది.ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నవారికి జగనన్న వసతి దీవెన కార్డు ఇవ్వనుంది.

వైఎస్సార్ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, కాపునేస్తం, సున్నావడ్డీ పథకం, అమ్మఒడి, దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులు, ఇమామ్స్‌, మోర్జమ్స్‌, పాస్టర్‌లకు ఆర్థికసాయానికి అర్హులను గుర్తించనున్నారు. వాలంటీర్లు రోజుకు కనీసం 5 ఇళ్ల సర్వే అయినా చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

'వైఎస్సార్ నవశకం' పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి... ఆయా జిల్లాల అధికారులు ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లకు మార్గ దర్శకాలు జారీ చేశారు.వైఎస్ఆర్ నవశకంతో సామాజిక విప్లవం వస్తుందని వైఎస్ఆర్‌ సీపీ నేతలు చెబుతున్నారు. అయితే...సర్వే పారదర్శకంగా జరగాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. డిసెంబర్‌ నాటికి సర్వే పూర్తి అయ్యే అవకాశంలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే..లబ్ధిదారులకు పథకాలు అందాలంటే సర్వే ముఖ్యమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే 'వైఎస్ఆర్ నవశకం' పేరిట సర్వే నిర్వహిస్తోంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని వాలంటీర్లు సర్వేలో పాల్గొననున్నారు. ప్రతి గడపకు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వేతో కుటుంబానికి సంబంధించిన మొత్తం డిటెయిల్స్ వస్తాయని అధికారులు నమ్మకంగా ఉన్నారు. దీంతో అవినీతికి అడ్డుపడుతుందని చెబుతున్నారు. అయితే..ఒకే కార్డు కాకుండా..మూడు కార్డులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ఒకే కార్డులో పెడితే మంచిదనే మాట వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం, అధికారులు పునరాలోచన చేయాలని ప్రజలు కూడా కోరుతున్నారు.

Next Story