ప్రియుడి కళ్లముందే ప్లైఓవర్‌ పై నుంచి దూకి ప్రేయసి ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 6:54 AM GMT
ప్రియుడి కళ్లముందే ప్లైఓవర్‌ పై నుంచి దూకి ప్రేయసి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ప్రియుడి కళ్ల ముందే యువతి ప్లైఓవర్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లోని సీతాఫల్‌మండీ జోషి కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన పాండుకు నలుగురు కుమార్తెలు. రెండవ కుమార్తె పూజిత (19) ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకుంది. అనంతరం ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకోమని ఇటీవల పూజిత.. ప్రదీప్‌ పై తరుచూ ఒత్తిడి తెస్తుండడంతో అతను కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ విషయమై మాట్లాడేందుకు ప్రదీప్‌ను సీతాఫల్‌ మండీ ఫ్లైఓవర్‌పైకి రావాలని పూజిత పిలిచింది. ప్రదీప్‌ మరో మిత్రుడితో కలిసి వచ్చాడు. పూజిత, ప్రదీప్‌లు కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మద్యా పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో క్షణికావేశంలో పూజిత పరిగెత్తుకుంటూ వెళ్లి ప్లైఓవర్‌ పై నుంచి కిందకు దూకింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూజిత మృతికి కారణమైన ప్రదీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story