ఈవ్టీజర్ల ఆటకట్టించే ‘ఆపరేషన్ దురాచారి’
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Sep 2020 7:09 AM GMTమహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మానవ మృగాలు, ఈవ్ టీజర్లు, పోకిరీలకు చెక్ పెట్టేందుకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఆపరేషన్ దురాచారి’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని బజారుకీడ్చి, అవమానించే విధంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారి ఫోటోలతో పోస్టర్లు పెట్టాలంటూ పోలీస్ శాఖను ఆదేశించారు. ఆడపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆయన పోలీసు శాఖకు స్పష్టం చేశారు. అలాగే.. యాంటి రోమియో స్క్వాడ్లను కూడా రంగంలోకి దించాలని ఆయన సూచించినట్టు సమాచారం.
ఇదిలావుంటే.. ఇప్పటికే లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీ సింగ్ లక్నో, పరిసర ప్రాంతాల్లో 'ఆపరేషన్ శక్తి' పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే పోలీసులు 2200 మంది నేరగాళ్లపై చెక్ పెట్టగా.. మొత్తం 822 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇక సీఎం యోగి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.