ఆల్ ఖైదా అగ్రనేత హతం
By సుభాష్
ఉగ్రవాద సంస్థ ఆల్ -ఖైదా యెమెన్ చీఫ్ ఖాసీం ఆల్ -రిమీని అమెరికా హతమార్చింది. దేశ నావిక దళ అధికారులను హతమార్చినందుకు గాను ఖాసీంను మట్టుబెట్టినట్లు అమెరికా పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఆల్ ఖైదా ఇన్ ఆరేబియా పెనిసులా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరిట ప్రకటన విడుదలైంది.
నావిక దళ అధికారులను హతమార్చినందుకే ఖాసీంను మట్టుబెట్టాం
నావిక దళంలో ఉన్న అధికారులను హతమార్చినందుకు ఖాసిమ్ అల్ రేమినిను హతమార్చినట్లు ట్రంప్ చెప్పారు. ఒసామాబిన్ లాడేన్ స్థాపించిన ఆన్ ఖైదా నెట్ వర్క్ కీలక దళంలో ఖాసీం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అమెరికాలో నావిక స్థావరంపై జరిగిన దాడులకు తామే కారణమని అంగీకరించిన కొన్ని రోజులకే అతన్ని అంతమొందించింది. రైమీ నేతృత్వంలో సామాన్య పౌరులపై సైతం ఆల్ ఖైదా అనేక దాడులకు తెగబడింది. అతను హతం కావడంతో కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కానీ ఖాసీంను ఎప్పుడు హతమార్చారనేది ట్రంప్ వెల్లడించలేదు.