మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమే : య‌న‌మ‌ల‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 May 2020 5:01 AM GMT
మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమే : య‌న‌మ‌ల‌

ఏపీలో వైన్ షాపులు తెరుస్తున్నాయంటూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో పాటు మ‌ద్యం ధ‌ర‌లు కూడా పెంచుతున్నామ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్రతిప‌క్ష నేత‌లు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలపై పన్నులు వేసిన ప్రభుత్వం ప్రపంచంలో లేదని.. ఇది పన్నులు వేసే సందర్భం కాదని.. ధరలు పెంచే సందర్భం అంతకన్నా కాదని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు.

రాష్ట్రంలో ఒకవైపు కరోనాతో అనేకమంది అనారోగ్యం పాలవుతుంటే.. మరోవైపు అధికార వైసీపీ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతుంద‌న్నారు. మద్యం ధరలు 25% పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఈ విఫ‌త్తు స‌మ‌యంలో ప్రజలపై రూ. 5వేల కోట్ల భారం మోపడాన్ని గర్హిస్తున్నామ‌న్నారు.

ఏపీలో మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడీ ధరల పెంపు నిర్ణయం జ‌రిగింద‌ని ఆయ‌న విమ‌‌ర్శించారు. ఇప్పటికే మద్యం కంపెనీలకు భారీగా ఉత్పత్తులకు అనుమతిచ్చారన్నారు. మద్యం కంపెనీల మేలు కోసం.. కమీషన్ల కోసమే ప్ర‌భుత్వం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతుంద‌ని ఫైర్ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని.. వైసీపీ నాయకులే నాటుసారా తయారీ వెనుక ఉన్నారని య‌న‌మ‌ల అన్నారు. నాసిర‌కం మ‌ద్యం వాలంటీర్లతో అమ్మిస్తున్నారని.. ఇప్పుడీ నిర్ణయంతో నాటుసారా తయారీ, నాసిరకం మద్యం అమ్మకాలు మరింత పేట్రేగిపోతాయ‌ని అన్నారు.

ఓ వైపు దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. ఏపీలో మ‌ద్యం దుకాణాల నుండి మద్యం దొడ్డిదారిన తరలించి అక్రమ అమ్మకాలు జరిపారని విమ‌ర్శించారు. ఎలుకలు ఇనుము తిన్నాయని గతంలో కథల్లో విన్నామ‌ని.. మద్యం తాగాయని చెప్పడం దారుణమ‌ని.. వైసీపీ పాలనలో ఎలుకలు మద్యం తాగాయని య‌న‌మ‌ల ప్ర‌భుత్వాన్ని ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఇచ్చింది సగం అయితే గుంజుకుంటోంది రెట్టింపని య‌న‌మ‌ల అన్నారు. గత ఏడాదిగా ఆర్టీసి ఛార్జీల పెంపు, కరెంట్ బిల్లుల పెంపు, ఇసుక ధర పెంపుతో ప్ర‌జ‌ల‌పై భారం మోపింద‌ని.. ఇప్పుడీ మద్యం ధరల పెంపు అనేది పేద ప్ర‌జ‌ల‌ రక్తం పిండుకోడమేన‌ని ఆయ‌న అన్నారు. మద్యం ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

పోషకాహారం అందించి, వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇత‌ర‌ రాష్ట్రాలు, విదేశాలు చూస్తుంటే.. మన రాష్ట్రంలో పోషకాహారం ఇవ్వకపోగా.. మద్యం దుకాణాలు తెర‌వ‌డం.. ధరలు 25% అదనంగా పెంచడం దారుణ‌మ‌న్నారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో ప్ర‌క‌టించారని.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెద్దఎత్తున తెరిచారని విమ‌ర్శించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వైసీపీ ప్ర‌భుత్వం దారుణంగా మోసం చేసింద‌ని.. వైసీపీ మోసాలకు బలైన ప్రజలే.. వారికి తగిన గుణపాఠం చెబుతారని య‌న‌మ‌ల అన్నారు.

Next Story