మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌: అదే బాటలో మరో రాష్ట్రం

By సుభాష్  Published on  14 April 2020 12:02 AM GMT
మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌: అదే బాటలో మరో రాష్ట్రం

ఒక వైపు కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ కొనసాగుతుంటే మరోవైపు మద్యం షాపులు మూతపడటంతో మందుబాబులు పడరాని కష్టాలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని షాపులతో పాటు మద్యం షాపులను మూసివేశాయి ప్రభుత్వాలు. దీంతో మద్యానికి బానిసలుగా మారిన మద్యం ప్రియులు మద్యం లేనిదే రోజువారీ బండి నడవని పరిస్థితి దాపురించింది. దీంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరి కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ మెంటల్‌ ఆస్సత్రుల్లో చేరుతున్నారు.

మద్యం ప్రియుల బాధలను గుర్తించిన పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వైన్స్‌ షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. ఇక పశ్చిమబెంగాల్‌లో మమతా సర్కార్‌ ఆన్‌లైన్‌ ద్వారా మద్యం అమ్మేందుకు అనుమతులు ఇచ్చింది. అలాగే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని మేఘాలయ ప్రభుత్వం కూడా సోమవారం నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభించింది. కానీ ఏప్రిల్‌ 13 నుంచి 17వ తేదీ వరకు మాత్రమే. మేఘాలయ సర్కార్ బాటలో కూడా అస్సాం ప్రభుత్వం కూడా చేరింది. ఈ రాష్ట్రంలో కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది.

ప్రతి రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం అమ్మేందుకు ముందుకొచ్చింది. మేఘాలయలో అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ షాపులు తెరవనున్నారు. అంతేకాదు మద్యం షాపులకు వచ్చే వారు సామాజిక దూరం పాటించాలని అస్సాం, మేఘాలయ ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేశాయి. ప్రతి వైన్స్‌ షాపుల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయాలని షాపు యజమాలను ఆదేశించాయి. కాగా, అస్నాంలో ఇప్పటి వరకూ 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో మద్య షాపులు తెరుచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మద్యం ప్రియులు రెండు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారని, మా బాధలను అర్థం చేసుకుని సమయానుకూలంగా మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని భారీగానే పట్టుకున్నారు పోలీసులు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక తెలంగాణలో అయితే మద్యం షాపుల్లో చోరీలు కూడా జరుగుతున్నాయి. మద్యం దొరక్క ఏకంగా షాపులకే కన్నాలు వేస్తూ ఖరీదైన మద్యాన్ని ఎత్తుకెళ్తున్నారు.

తెలంగాణ సర్కార్‌కు తలనొప్పిగా మారిన మద్యం ప్రియుల కష్టాలు

ఇక తెలంగాణ రాష్ట్రంలో మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారిన కొందరు ప్రతీరోజు కంటిమీద కనుకు లేకుండా పోతోంది. కొందరు మద్యం లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో ఎర్రగడ్డ మెంట్‌ ఆస్పత్రికి క్యూ కట్టారు. దీంతో రోజురోజుకు వీళ్ల సంఖ్య కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కంటే ఎక్కువగానే మారిపోతోంది. ఎర్రగడ్డ మెంట్‌ ఆస్పత్రిలో కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో అటు ప్రభుత్వానికి, ఇటు వైద్యులకు తలనొప్పిగా మారుతోంది.

Next Story