ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు
By - Knakam Karthik |
అమరావతి: పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో దక్షిణఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
ఆదివారం(14-09-2025)
* శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 87. 2మిమీ, గుంటూరు జిల్లా పెదకాకానిలో 77.2మిమీ, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 75మిమీ, గుంటూరు జిల్లా వల్లభపురంలో 74మిమీ, గుంటూరులో 72. 2మిమీ,నూజివీడులో 71మిమీ, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 70.7మిమీ,కౌతవరంలో 70.2మిమీ, ప్రకాశం జిల్లా దర్శిలో 68.5మిమీ చొప్పున భారీ వర్షపాతం, 47 ప్రాంతాల్లో 40మిమీకు పైగా వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.