రాయలసీమకు భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 19 Sept 2025 7:44 PM IST

రాయలసీమకు భారీ వ‌ర్ష హెచ్చ‌రిక‌

మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారాన్ని బట్టి ఇది సెప్టెంబర్27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే రోజు పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

* శనివారం(20-09-25)

కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

* శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతిలో 76.5మిమీ, చిత్తూరు జిల్లా కతేరపల్లెలో 73.2మిమీ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 68.2మిమీ, అక్కంపేటలో 55.5మిమీ, కలిగిరిలో 46మిమీ వర్షపాతం నమోదయిందన్నారు.

Next Story