బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 27న ఏపీ లోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.