బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్

బంగాళఖాతంలో ఏర్పడిన ‘మిచౌంగ్’ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

By Medi Samrat  Published on  5 Dec 2023 9:31 AM GMT
బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిచౌంగ్

బంగాళఖాతంలో ఏర్పడిన ‘మిచౌంగ్’ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో గంటలో మిచౌంగ్ తుపాను పూర్తిగా తీరాన్ని దాటనుందని పేర్కొన్నారు. తుపాను బాపట్ల తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేశారు. మిచౌంగ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

దక్షిణ కోస్తా ఏరియాలో పెను గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 2 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బాపట్ల వద్ద మిగ్జామ్ తుపాను తీరాన్ని దాటనుంది. తుపాను తీరాన్ని చేరువవుతున్న క్రమంలో దట్టమైన మేఘాలు సగభాగం భూ ఉపరితలం మీదకు వచ్చేశాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి.

Next Story