బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

By Kalasani Durgapraveen
Published on : 29 Oct 2024 5:15 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలలో వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు పడే సూచన చేసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్న నేపథ్యంలో ... వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు హైదరాబాద్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ రోజు ఈదురుగాలూలతో కూడిన మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రేపు బలమైన, స్థిరమైన ఉపరితల గాలులు (గాలి వేగం గంటకు 30- 40 కి.మీ) రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వీచే అవకాశం ఉంది. అల్పపీడనం, రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Next Story