విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది : ష‌ర్మిల

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ ష‌ర్మిల ప్ర‌ధాని మోదీ, కూటమి ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

By Medi Samrat
Published on : 19 March 2025 3:45 PM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది : ష‌ర్మిల

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ ష‌ర్మిల ప్ర‌ధాని మోదీ, కూటమి ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు.. మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇస్తారు.. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని దుయ్య‌బ‌ట్టారు. పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే.. లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు ప్ర‌ధాని మోదీ ఆజ్యం పోస్తూనే ఉన్నారన్నారు.

రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే.. లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారు.. విశాఖ స్టీల్‌పై మోదీ ఫార్ములా సైలెంట్ కిల్లింగ్ అని విమ‌ర్శించారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసం.. ప్లాంట్‌ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలేనని.. అంతా మోసపూరితం. అసత్యపు వాగ్దానాలు అని ఎండ‌గ‌ట్టారు.

విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉందన్నారు. మోదీని కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కును చంపడంలో కర్త మోదీ అయితే ఖ‌ర్మ‌, క్రియ బాబు, ప‌వ‌న్‌లేన‌న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నామ‌న్నారు. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజిమెంట్ నుంచి వచ్చిన సమాధానంపై ఏం చెప్తారు.? అని ప్ర‌శ్నించారు.

నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం నేటికి అమలు అనే సమాధానంపై మీ వైఖరి ఏంటి.? ప్లాంట్ ను ఉద్ధరించేందుకు మోదీ ఇచ్చే అచంచలమైన మద్దతు అంటే ఇదేనా.? ప్రైవేటీకరణ ఆపకపోవడమేనా వికసిత భారత్ - వికసిత ఆంధ్ర.? మీ నిబద్ధత, ఎన్నికల వాగ్ధానం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం అంటే ఇదేనా.? కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇప్పటికైనా మోదీ కుటిల ప్రయత్నాలు మానుకోవాలని.. వెంటనే స్టీల్ ప్లాంట్‌ను SAIL లో విలీనం చేసే విష‌య‌మై తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను, కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story