విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం

విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది.

By Medi Samrat
Published on : 8 Sept 2025 7:30 PM IST

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్.. సీఎం సమక్షంలో కుదిరిన ఒప్పందం

విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని మధురవాడ జోన్–2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి మొత్తం రూ.553 కోట్లు వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టులో రూ.498 కోట్లు ఐఎఫ్‌సీ రుణంగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవిఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు వినియోగించనుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్‌సీకి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతం (ఫ్లోటింగ్)గా నిర్ణయించారు. త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్‌గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్ - లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం – నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్‌ చేయనున్నారు. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు. నీటి శుద్ధి వల్ల వ్యాధులు తగ్గడంతో పాటు, భూగర్భజలాలు కలుషితం కావు, పర్యావరణానికి మేలు చేస్తుంది. వరద నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర కోట్ల మందికి ఉపయోగకారిగా ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో నగరాల ఆర్థిక స్వయంప్రతిపత్తికి కొత్త దారి చూపినట్టయ్యింది.

Next Story