ఎక్కడ దాక్కున్నారు టీడీపీ నేతలు.. చర్చకు సిద్ధమా..?
Gudivada Amarnath Reddy Fires on TDP. 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి
By Medi Samrat Published on 29 Aug 2021 10:57 AM GMT
14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ ఒక్క మంచి పని చేయలేదని, ఎన్నికలప్పుడు మాత్రమే టీడీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకు వస్తారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్, నేటి సీఎం వైయస్ జగన్ నేతృత్వంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు, విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేస్తే.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో టీడీపీ వేదిక ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని అమర్ దుయ్యబట్టారు.
విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్ మాట్లాడుతూ.. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు అలసత్వం వల్లే విశాఖ స్టీల్ప్లాంట్కు ఈ దుస్థితి ఏర్పడిందని, విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకుందని, కార్మికులంతా రోడ్లమీదకు వచ్చి నిరసన తెలుపుతుంటే టీడీపీ నేతలు ఎక్కడ దాక్కున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందో చర్చకు తాము సిద్ధమని.. అందుకు టీడీపీ నేతలు సిద్ధమా అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు.