ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) తిరిగి రావడం సంతోషదాయకమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైజాగ్ వేదికగా పీకేఎల్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఈనెల 29న తొలి మ్యాచ్ ప్రారంభించబోవడం శుభపరిణామమని వెల్లడించారు.
2018లో ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా జరిగిన 6వ సీజన్లో క్రీడాభిమానులు, వీక్షకులు అత్యంత అనుభూతిని పొందారని, విశాఖలో జరగబోయే 12వ సీజన్ కూడా ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని తెలియజేశారు. 12వ సీజన్ కూడా సరికొత్త అధ్యాయంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సహకరిస్తుందని, ప్రో కబడ్డీ లీగ్ను ఏపీలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు, అసోసియేట్ పార్టనర్స్, స్పాన్సర్లకు అన్ని విధాలా సహకరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.