బెంగళూరులో కదులుతున్న కారు సన్రూఫ్ ఓపెన్ చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారికి జరిమానా విధించారు. మే 27, మంగళవారం నగరంలోని ట్రినిటీ రోడ్లో ఈ సంఘటన జరిగింది. కోరమంగళలో ఆ జంట భోజనం చేసి ఇంటికి తిరిగి వెళుతుండగా రొమాన్స్ లో మునిగిపోయారు. ఆ కారు వెనుక వెళుతున్న ఇతర వాహనదారులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'కర్ణాటక పోర్ట్ఫోలియో' అనే X హ్యాండిల్ ఈ క్లిప్ను షేర్ చేసి, పోలీసులను ట్యాగ్ చేసింది. ఈ చర్యల ద్వారా రోడ్డు ప్రమాదం జరగడమే కాకుండా, ప్రజలకు చెడ్డ ఉదాహరణగా నిలుస్తుందని ఆరోపించింది.
పోలీసులు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహన యజమానిని గుర్తించి రూ. 1,500 జరిమానా విధించారు. ఇందులో ప్రమాదకరమైన డ్రైవింగ్ కింద రూ. 1,000, సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలకు అదనంగా రూ. 500 జరిమానా ఉన్నాయి. ఇటువంటి ప్రవర్తన వారిని ప్రమాదంలో పడేయడమే కాకుండా ఇతర రోడ్డు వినియోగదారులను కూడా ప్రమాదంలో పడేస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 12, 2025న మరో యువ జంట మాదవర మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్లో అనుచితంగా ప్రవర్తించడం కెమెరాలో రికార్డు అయింది. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.