దిశ ఎస్ఓఎస్ కాల్ తో ఇద్దరి ప్రాణాలను కాపాడిన పోలీసులు
Vijayawada Police Saves Woman Life. ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను మోసం చేయడంతో.. సమాజంలో
By Medi Samrat Published on 26 Aug 2021 2:18 PM GMT
ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను మోసం చేయడంతో.. సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక గత్యంతరం లేని పరిస్థితిలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలని కోరుతూ అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఓ మహిళ దిశ ఎస్ఓఎస్కి సందేశాన్ని అందించింది. దిశ ఎస్ఓఎస్ కు పంపిన సమాచారం నెంబరు ఆధారంగా మహిళ ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది దిశ కంట్రోల్ రూం సిబ్బంది. హుటాహుటిన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారాన్ని చేరవేసింది.
సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు స్పందించి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే గుర్తుతెలియని విషం సేవించి అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించారు పోలీసులు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మహిళ ప్రాణాలను నిలబెట్టారు. అంతేకాకుండా మహిళతో పాటు ఉన్న ఐదు సంవత్సరాల బాలికను చేరదీసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.